Wednesday, November 29, 2023
HomeUncategorizedరాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ తో మైత్రి

రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ తో మైత్రి

సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

 

బీజేపీ ప్రమాదం ముంచుకొస్తోంది..!

-మార్చి 17 నుంచి కేంద్రం విధానాలపై ‘ప్రజాగర్జన’
-మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు

-బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణ సీపీఐ (ఎం) లక్ష్యం

-రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ తో మైత్రి

  • – సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా విస్తృత సమావేశంలో
    రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం,ఫిభ్రవరి 27 (జనవిజయం) : బిజెపి ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. బిజెపి వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోంది అన్నారు. రాజకీయ వైఖరీ రీత్యానే బీఆర్ఎస్ తో మైత్రి అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ (ఎం) జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 17వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మూడు బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ జాతాను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 21వ తేదీన ఏన్కూరులో జిల్లాలోకి ప్రవేశించే యాత్ర 25వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. స్థానిక మంచి కంటి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. తనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, సాగర్ జాన్ వెస్లీ సారథ్యం వహిస్తారని వివరించారు. కార్పొరేట్ తొత్తుగా మారిన బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. మార్చి 17న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సారథ్యంలో హనుమకొండలో ప్రారంభమయ్యే యాత్రను జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని చెప్పారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ నుంచి మరో రెండు బృందాలు యాత్రలు నిర్వహిస్తాయన్నారు.

మార్చి 30వ తేదీ నాటికి హైదరాబాదులోని తుర్కయంజాల్ ప్రాంతానికి చేరుకుంటాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడమే యాత్రల ప్రధాన ఉద్దేశంగా చెప్పారు. బిజెపి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటేటా దిగజారుతుందన్నారు. మరోవైపు మోడీ స్నేహితుడు అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడని తెలిపారు. అక్రమ పద్ధతిలో మోడీ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగాడని హిండెన్ బర్గ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఈ నివేదికతో అదానీకి చెందిన రూ.12 లక్షల కోట్లు ఆవిరయ్యాయని తెలిపారు. మోడీ సహకారంతో గణనీయంగా పెరిగిన అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువను చూపి రూ. లక్షల కోట్ల రుణాలు సేకరించారని వివరించారు. ఒక్క ఎల్ఐసి నుంచే రూ.80వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ మూడు నుంచి 30వ స్థానానికి దిగజారినట్లు చెప్పారు. బిజెపి వ్యతిరేక పక్షాలను బెదిరించేందుకే ఈడిని వాడుకుంటుందని, సుప్రీం జోక్యం చేసు కోపోయి ఉంటే… అదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు బిజెపి అంగీకరించేది కాదన్నారు. మరోవైపు గ్యాస్, ఎరువుల సబ్సిడీ, ఉపాధి నిధుల్లో కేంద్రం కోత పెడుతుందన్నారు. ఆర్యులే భారతీయ హిందువులుగా చరిత్ర వక్రీకరణకు బిజెపి పూనుకుంటుందన్నారు. ఉత్తరాదిలో వస్తున్న వ్యతిరేకతను దక్షిణాదిలో పూడ్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి భాగ్యలక్ష్మి ఆలయం మీద ఉన్న ప్రేమ, సచివాలయం గోపురాలు కూల్చడం పై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపై లేదన్నారు. చాతుర్వరణ వ్యవస్థను పునఃస్థాపించటమే బీజేపీ ధ్యేయమన్నారు. బిజెపి వ్యతిరేక శక్తుల సమీకరణ జాతీయ కమిటీ నిర్ణయంగా పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బిఆర్ఎస్ నెగ్గకపోయి ఉంటే.. అసంతృప్త నేతలు బిజెపి దారి పట్టే వారని అన్నారు. అందుకే ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు బిజెపికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. ఈసారి తెలంగాణ శాసనసభలో సిపిఎం అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కర్తవ్యాలను పార్టీ సభ్యులకు ఉద్బోధించారు.‌ జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందాల్సిన సాగర్ జలాలను సమృద్ధిగా ఇవ్వాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. విడతల వారీగా నీరు ఇవ్వడం వల్ల చివరి ఆయకట్టులో పంటలు ఎండుతున్నాయన్నారు. 6000 క్యూసెక్కుల నీరు వదలాల్సి ఉండగా రెండున్నర వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారని తెలిపారు. జిల్లా మంత్రి జోక్యం చేసుకొని సరిపడా నీరు అందేలా చూడాలన్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తీసివేతను వ్యతిరేకించారు. కేంద్రం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతకుముందు పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ప్లీనం సంతాపం తెలిపింది. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, వై. విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, చింతలచెరువు కోటేశ్వరరావు, బుగ్గ వీటి సరళ, పార్టీ సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments