తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలది.
కె సి అరూ.. ప్రధాని సీటు ఖాళీగా లేదు…అమిత్ షా…
చేవెళ్ల ,ఏప్రిల్ 23(జనవిజయం): చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు బీజేపీ విజయ సంకల్ప సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. భారత్ మాతా కీ జై అంటూ అమిత్ షా తన ప్రసంగం ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ ఆశీర్వాదంతో మాట్లాడుతున్నానని తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతి పాలనను, కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 9 ఏళ్లుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా వద్దా? అని అన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వినిపించేలా నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు.
పేపర్ లీక్ పై ప్రశ్నించిన బండి సంజయ్ ని జైల్లో పెట్టారని, కానీ 24 గంటల్లోనే బెయిల్ వచ్చిందని అమిత్ షా తెలిపారు. బండి సంజయ్ ఏం తప్పు చేశారని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడబోరని స్పష్టం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మాట్లాడనివ్వడంలేదని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మోదీ నుంచి ప్రజలను దూరం చేయలేరని అమిత్ షా స్పష్టం చేశారు.
అమిత్ షా ప్రసంగం ముఖ్యాంశాలు…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయం.
తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి… పదో తరగతి పేపర్ కూడా లీక్ అయింది.
తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీక్ అవుతోంది. ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వారికి పాలన అవసరమా?
లక్షలాది యువత భవిష్యత్తును కేసీఆర్ సర్కారు నాశనం చేస్తోంది. ఎన్నికల సమరాంగణంలో యువతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతుంది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.
ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ప్రధాని సీటు ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుస్తుంది… మోదీనే మరోసారి ప్రధాని అవుతారు.
కేసీఆర్ తన ముఖ్యంత్రి పీఠం కాపాడుకుంటే చాలు!
కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు.
ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడంలేదు. కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించింది.
అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీ ఎప్పుడూ ఎంఐఎంకు భయపడేది లేదు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలది.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతున్నానని అన్నారు